న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాధాకృష్ణన్ చేత పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు.వీరితోపాటుమాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్,మాజీఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్, వెంకయ్యనాయుడు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన తర్వాత ధన్ఖడ్ కనపడడం ఇదే తొలిసారి.ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాధాకృష్ణన్కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఆయన గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్గా గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితులైన రాధాకృష్ణన్, తన 16వ ఏటనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. తమిళనాడు బీజేపీలో కార్యదర్శిగా, అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1998,1999 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. తన అనుచరులు ఆయన్ను ‘తమిళనాడు మోదీ’ అని పిలుచుకుంటారు. మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన జార్ఖండ్ గవర్నర్గా, తెలంగాణ ఇన్చార్జి గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్గానూ సేవలు అందించారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్ కు పలువురు అభినందనలు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar