అమరావతి,ఐఏషియ న్యూస్: దృష్టిలోపం దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డు కాకూడదని, వారికి మిగిలిన విద్యార్థులతో సమానంగా అవకాశాలు కల్పించడానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా చొరవ చూపారు. దృష్టి లోపం గల దివ్యాంగ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపిసి కోర్సులు చదవడానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ జీ ఓ 278 జారీ చేసింది. తమకు సైన్స్ కోర్సుల్లో అవకాశం కల్పించాలని దృష్టిలోపం గల విద్యార్థులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కు విన్నవించారు. దివ్యాంగుల మనోభావాలను తెలుసుకున్న లోకేష్ వారి విన్నపాన్ని పరిశీలించాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్స్ పరీక్షలకు ఆ విద్యార్థులు హాజరు కావడం కష్టమని అధికారులు తెలిపారు. అందుకు ప్రత్యామ్నాయంగా వారికి లఘురూప ప్రశ్నలు ఇచ్చి ఎసెస్ మెంట్ చేయాల్సిందిగా మంత్రి లోకేష్ సూచించారు. ఈ మేరకు విధివిధానాలతో జీఓ విడుదలైంది. తమ మనోభావాలను గౌరవించి సైన్స్ కోర్సుల్లో అవకాశం కల్పించిన లోకేష్ కు దృష్టిలోపం గల దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు. గతంలోకి ఐఐటిల్లో ప్రవేశానికి దివ్యాంగ విద్యార్థులకు సమస్య తలెత్తినపుడు మంత్రి లోకేష్ చొరవ చూపి ప్రత్యేక జీఓ విడుదల చేయించారు.
Authored by: Vaddadi udayakumar