రాజ్యసభకు యనమల.. టిడిపికి దక్కనున్న మరో కేంద్ర మంత్రి పదవి
(వడ్డాది ఉదయకుమార్)
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: మిత్రపక్షం టీడీపీకి బీజేపీ నాయకత్వం మరో ఆఫర్ ఇచ్చింది. ఎన్డీఏ బలోపేతంలో భాగంగా మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రివర్గంతో పాటుగా కీలక పదవుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. తాజా చర్చల్లో భాగంగా టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటుగా కేంద్రంలోని కీలక నియామకాల్లోనూ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు ఈ పదవికి ఎవరిని ఖరారు చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.
టిడిపికి వరించనున్న మరో గవర్నర్ పదవి
బీజేపీ నాయకత్వం మిత్రపక్షాల విషయంలో గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. త్వరలో బీహార్ .. ఆ తరువాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. టీడీపీకి కేంద్ర కేబినెట్ లో రెండు మంత్రి పదవులు దక్కాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమించారు. 2014-2018 మధ్య కాలంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో గవర్నర్ పదవి పైన హామీ దక్కింది. అయితే, అమలు కాలేదు. ఈసారి తొలి ఏడాది పూర్తవుతూనే గవర్నర్ పదవి పైన నిర్ణయంతీసుకోనున్నారు.ఇదేసమయంలో టీడీపీకి ప్రాధాన్యత కల్పిస్తూ మరో గవర్నర్ పదవి పైన హామీ దక్కినట్లు పార్టీ ముఖ్య నేతల ద్వారా సమాచారం అందుతోంది.
చంద్రబాబు ఛాయిస్ ఎవరు?
టీడీపీకి మరో గవర్నర్ పదవి పైన టీడీపీ నుంచి చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారనేది చర్చ జరుగుతోంది. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఖరారు వేళ అనేక సమీకరణాలు కలిసి వచ్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత కావటంతో పాటుగా వివాద రహితుడు.ఆయన వర్గానికి చెందిన వారికి ప్రస్తుత కేబినెట్ లో అవకాశం దక్కలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతగా అశోక్ గజపతి రాజు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక, బీసీ – ఎస్సీ వర్గాల నుంచి రెండో గవర్నర్ పదవి పైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత మాజీ స్పీకర్ యనమల సైతం ఈ రేసులో ప్రముఖంగా ఉన్నా ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పిస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో, రెండో గవర్నర్ పదవి రాయలసీమ కు చెందిన బీసీ నేతకు ఇస్తారనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
కేఈ కృష్ణమూర్తికి గవర్నర్ పదవి వరించనున్నదా?
అందులో భాగంగా రాయలసీమ నుంచి చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ లో పని చేసి ఆ తరువాత టీడీపీలో అనేకకీలకపదవులునిర్వహించిన కేఈ క్రిష్ణమూర్తి పేరు తెర మీదకు వచ్చినట్లు సమాచారం.అయితే, కేఈ కుమారుడికి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. పత్తికొండ నుంచి గెలుపొందారు.ఆ తరువాత కేఈ క్రిష్ణమూర్తి రాజకీయంగా క్రియాశీలకంగా లేరు.2014-19 కాలంలో డిప్యూటీ సీఎం హోదాలో కేఈ పని చేసారు. దీంతో ఈసారి గవర్నర్ పదవి బీసీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో కీలక నియామకాల్లోనూ టీడీపీకి చెందిన ఏపీ, తెలంగాణ నేతలకు అవకాశం దక్కనుంది. ఈ మేరకు టీడీపీ నుంచి జాబితా కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ పైనా చర్చ జరుగుతున్న వేళ కేంద్రంలో మరో మంత్రి పదవి,గవర్నర్ హోదా ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఏపీలోని కూటమి పార్టీల్లో ఆసక్తికర చర్చగా మారుతోంది. ఇది ఏమైనాప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar