తిరుపతి,ఐఏషియ న్యూస్: తిరుపతి- షిర్డీ మధ్య ఇకపై ప్రతిరోజూ రైలు నడవనుంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇప్పటివరకు తాత్కాలికంగా నడిచే సర్వీసును రెగ్యులర్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతి- షిర్డీ మధ్య 07637/07638 నంబర్ రైలును ఇకపై ప్రతి రోజూ నడపనున్నట్లు వెల్లడించింది. రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ స్టేషన్ల మీదుగా ఈ రైలు షిర్డీ చేరుకోనుంది. తిరుపతి టూ షిర్డీ మధ్య రైలు నడపాలని ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తాజాగా ఆయన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది.త్వరలో బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. ఈ క్రమంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇటీవల ఆ రైళ్లను నవంబర్ వరకు పొడిగించింది. వాటిలో తిరుపతి- షిర్డీ, నరసాపురం-తిరువణ్ణామలై మధ్య నడిచే రైళ్లతో పాటు, హైదరాబాద్-కొల్లాం, కాచిగూడ-మధురై మార్గాల్లోని స్పెషల్ ట్రైన్స్ కూడా తిరుపతి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఇక ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
Authored by: Vaddadi udayakumar