కనీస పాస్ మార్కులను 35 నుంచి 33కు తగ్గించిన కర్ణాటక ప్రభుత్వం

బెంగళూరు,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం పదో తరగతి,ఇంటర్మీడియట్‌లో ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. అయితే, కర్ణాటక ప్రభుత్వం 35 మార్కుల పాస్ నిబంధనలను తాజాగా తొలగిస్తూ మార్పులు చేసింది.2025-26 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి,ఇంటర్ పరీక్షల మూల్యాంకన విధానంలో కొత్త నిబంధనలను అమలు చేయనుంది.ఈ ముసాయిదా నిబంధనల్లో రెండు కీలక సూచనలు ప్రకటించింది.ఒకటి పాస్ మార్కులను తగ్గించడం,రెండు అంతర్గత మూల్యాంకన (ప్రాక్టికల్స్) మార్కులను పాస్ మార్కులకు కలపడం. పదవ తరగతి పరీక్షలలో మొత్తం మార్కులలో కనీసం 33 మార్కులు విద్యార్థి సాధిస్తే పాస్ అయినట్టే.ఇప్పటివరకు ఇది 35గా ఉండేది.

ఇకపై విద్యార్థి అంతర్గత మూల్యాంకన (ప్రాక్టికల్స్), బాహ్య పరీక్షల్లో పొందిన మార్కుల మొత్తం 33శాతం ఉంటే సరిపోతుంది. మొత్తం 625 మార్కులకు గానూ కనీసం 206 మార్కులు (ప్రతి సబ్జెక్ట్‌ కనీసం 30 శాతం) పొందితే ఉత్తీర్ణులవుతారు.అలాగే, ఫస్ట్ లాంగ్వేజ్‌కు మొత్తం మార్కులు 125 యథావిధిగా కొనసాగుతుంది. మిగతా ఐదు సబ్జెక్ట్‌లు ఒక్కోదానికి 100 మార్కుల్లో ఎలాంటి మార్పులేదు. కర్ణాటక రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ బోర్డు ఫస్ట్ రెగ్యులేషన్స్ (సవరణ) 2025 అనే నిబంధనల ద్వారా ఇవి అమల్లోకి వస్తాయి. జులై 22న కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా ప్రకారం.. ఇంటర్ పరీక్షల్లో విద్యార్థి మొత్తం మార్కుల్లో కనీసం 33శాతం సాధిస్తే చాలు. ప్రస్తుతం ఇది కూడా 35శాతంగా ఉంది. అలాగే ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 30శాతం మార్కులు రావాలి. వీటిని రాత పరీక్షలో వచ్చిన స్కోరు, అంతర్గత లేదా ప్రాక్టికల్ పరీక్షలో మార్కులను కలిపి లెక్కిస్తారు.ప్రాక్టికల్స్ లేదా అంతర్గత మూల్యాంకనం లేని సబ్జెక్ట్‌‌లో 80 మార్కుల రాత పరీక్షలో కనీసం 24 మార్కులు సాధించాలి. ప్రాక్టికల్స్ ఉన్న సబ్జెక్ట్ రాత పరీక్ష 70 మార్కులకు ఉండే.. కనీసం 21 మార్కులు రావాలి.ప్రాక్టికల్స్‌లో కూడా మార్పులు చేశారు. ఇప్పటివరకు ప్రాక్టికల్స్‌కు 30 మార్కులు ఉండగా, ఇకపై 20 మార్కులకు నిర్వహిస్తారు. మిగతా 10 మార్కులు ప్రతి సబ్జెక్ట్‌ (థియరీ, ప్రాక్టికల్) కనీసం 75శాతం హాజరు, నిర్దేశించిన సంఖ్యలో ప్రాక్టికల్స్‌ను నిర్వహించడం, లెక్చరర్ సర్టిఫై చేసిన ప్రాక్టికల్ రికార్డు సమర్పించడం, ప్రాక్టికల్ పరీక్షకు హాజరు వాటి ఆధారంగా ఉంటాయి.

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వంటి కేంద్ర విద్యాబోర్డుల విధానాలకు అనుగుణంగా ఈ మార్పులు ఉన్నాయి.కాగా,ఇప్పటివరకు పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో దేశంలో కర్ణాటక తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదవుతోంది.అంతర్గత మార్కుల గణన లేకపోవడం,పాస్ మార్కులు ఎక్కువగా ఉండటమేనని ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతిలో 62 శాతం, ఇంటర్‌లో 69.16 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐨𝐟 𝐖𝐨𝐫𝐤 𝟐𝟎𝟐𝟔: 𝐒𝐤𝐢𝐥𝐥𝐬, 𝐒𝐡𝐢𝐟𝐭𝐬, 𝐚𝐧𝐝 𝐒𝐦𝐚𝐫𝐭 𝐂𝐚𝐫𝐞𝐞𝐫 𝐂𝐡𝐨𝐢𝐜𝐞𝐬!

As we enter 𝟐𝟎𝟐𝟔, the future of work is being reshaped by AI, automation, and …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *