విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఏపీలో వాణిజ్య రాజధాని విశాఖలో తాజాగా నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సు సక్సెస్ అయింది. ఇందులో భారీ ఎత్తున పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని గ్రౌండ్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ సహా పలు ఐటీ సంస్ధలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాయి. ఇదే క్రమంలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ 2026 జనవరిలోనే విశాఖలో క్యాంపస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్యాంపస్ లు కలిగిన కాగ్నిజెంట్ సంస్ధ ఇప్పుడు విశాఖలో తమ క్యాంపస్ ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. అయితే వెంటనే భవనాలు సిద్ధంగా లేకపోవడంతో కాపులుప్పాడలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో 800 మంది ఉద్యోగులతో పని ప్రారంభించాలని ప్రణాళికలు చేసుకుంటోంది. ఇప్పటికే దేశంలోని వివిధ క్యాంపస్ లలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వబోతోంది.
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కు అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న టీనెక్లో ప్రధాన కార్యాలయం ఉంది. ఇది అమెరికన్ బహుళజాతి సమాచార సాంకేతిక కన్సల్టింగ్,అవుట్సోర్సింగ్ సంస్థ. ఆరోగ్య సంరక్షణ,ఆర్థిక సేవలు, తయారీ వంటి వివిధ రంగాల్లోని క్లయింట్లకు ఐటీ కన్సల్టింగ్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఏఐ, క్లౌడ్ సొల్యూషన్స్,డిజిటల్ ఇంజనీరింగ్తో సహా పలు సేవలను అందిస్తోంది.ఈ కంపెనీ 1994లో భారత్ లో అడుగుపెట్టింది.ఇప్పుడు విశాఖలో అడుగుపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం కాపులుప్పాడలో 21.33 ఎకరాల స్ధలం కేటాయించింది. దీంతో రూ.1,583 కోట్ల వ్యయంతో క్యాంపస్ నిర్మించబోతోంది. ఇందులో దశలవారీగా 8 వేల ఉద్యోగాలు కల్పించబోతోంది. ఈ క్యాంపస్ ప్రారంభానికి ముందే తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేసుకుని అందులో డెలివరీ సెంటర్ ను జనవరిలో ప్రారంభించనుంది.ఇందులో పని చేసేందుకు ఆసక్తి ఉన్న ఏపీ ఉద్యోగుల అభిప్రాయాల్ని సేకరిస్తోంది.త్వరలోనే వీరికి అక్కడ పోస్టింగ్ ఇవ్వనుంది. దేశంలో నలుమూలల పనిచేస్తున్న విశాఖకు చెందిన కాగ్నిజెంట్ ఉద్యోగులు విశాఖకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News