అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేయాలని అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. వైద్యఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్న ఏపీ సర్కార్ ఈ క్రమంలోనే సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అనుమతి లేకుండా దీర్ఘకాలంగా విధులకు హాజరు కాని 62 మంది వైద్యులపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది.
ఆ వైద్యులకు షోకాజ్ నోటీసులు
వీరిలో 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్ లు ఉన్నారు. వీరంతా చాలా కాలంగా విధులకు రావటం లేదు. విధులకు గైర్హాజరుతో ఏడాదికి పైగా రాజకీయ పలుకుబడితో నెట్టుకొస్తున్న వైద్యుల సేవలను తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ మేరకు వారికి షోకాజ్ నోటీసులు పంపించారు.
వివరణ కోరిన ప్రభుత్వం
ఈనెల 31వ తేదీలోపు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో వారి సేవలు రద్దు చేయబడతాయని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, ఒంగోలు, అనంతపురం,కడపలో ఉన్న వివిధ ప్రభుత్వ, సిద్ధార్థ మెడికల్ కళాశాలలలో పలువురు డాక్టర్లు, ప్రొఫెసర్లు విధులకు హాజరు కావడం లేదు. కొందరు ఏడాదిగా విధులకు దూరంగా ఉంటే మరికొందరు రెండేళ్లు, మూడేళ్లు, ఇంకొందరైతే సుదీర్ఘకాలంగా కూడా విధులకు హాజరు కావడం లేదు.
షోకాజ్ నోటీసులకు ఏం సమాధానం ఇస్తారో
ఏళ్ల తరబడి విధులకు వీరు రాకుండా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఏళ్ల తరబడి విధులకు రానివారు మరి షోకాజ్ నోటీసుల విషయంలో ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిందే.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News