విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: తెలుగుభాష రక్షణ కోసం తెలుగుదండు చేపట్టిన “టిట్టిభ సత్యాగ్రహం” మూడవ రోజు కూడా విజయవంతంగా జరిగింది. అనుకోని అతిథులుగా విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని నింపారు.దీక్షా వేదికపై తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ..ఓ పెద్దయ్యా పెద్దలు అంత పెద్దగా రావటంలేదని నువ్వంత పెద్దగా బెంగపడొద్దు. మేము లేమూ..మరిచిపోయారా? మన భాషను, మన సంస్కృతిని గట్టిగా కాపాడుకొందాం. మీరు అస్సలు తగ్గకండి అంటూ..మద్దతు పలికి, నాలో నమ్మకాన్ని నింపిన.. ఈ తెలుగు తల్లులకు కొద్దిగా సిగ్గుపడుతూ.కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ చమత్కరించారు.సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న పలువురు భాషాభిమానులు పలుకుతూ..మన తెలుగుభాష రక్షణ విషయంలో రాజీలేని పోరాటం చేస్తామని, ఏదేమైనా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని, మన తెలుగు గడ్డపై.. అది ప్రభుత్వ బడైనా, పైసల బడైనా ప్రాథమిక విద్యాబోధన కచ్చితంగా మాతృభాషలో జరిగేంతవరకూ దీక్ష కొనసాగిస్తామని, అవసరమైతే.. ఈనెల 17వ తేదీ నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో.. ఆచార్య సూరప్పడు, తిరుపతి రాజమన్నార్, నరహరిశెట్టి శ్రీధర్, అల్లు వెంకటరమణ, ముక్తవరపు శ్రీనివాస్, చైతన్య కళాశాల విద్యార్థినులు, భాషాభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని భాషాదీక్షకు సంఘీభావం ప్రకటించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News