హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. మూడు పార్టీలకూ అగ్నిపరీక్ష పెడుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంపై కన్నేశాయి. దీన్ని హస్తగతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారంటే.. ఈ ఎన్నికను ఆ పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ పరిస్థితుల మధ్య లోక్ పోల్ సంస్థ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించింది. ఓటర్ల మనోగతాన్ని అడిగి తెలుసుకుంది. 3,100 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది లోక్ పోల్. ఇక్కడ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనపర్చుతోంది. ఈ నియోజకవర్గంలో 44 శాతం మంది ఓటర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు. బీఆర్ఎస్- 38, బీజేపీ- 15 శాతం ఓటర్ల మద్దతు కనిపించింది. ఇతరులు మూడుశాతం మేర ప్రభావం చూపనున్నారు.బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య ఆరు శాతం తేడా ఉండటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. కాంగ్రెస్ కు ఏఐఎంఐఎం మద్దతు ప్రకటించడం టర్నింగ్ పాయింట్ గా పేర్కొంది. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎంఐఎం మెజారిటీ మద్దతుదారులు, ఆ పార్టీ ఓటుబ్యాంక్.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని లోక్ పోల్ అంచనావేసింది. కాంగ్రెస్ కు ఆధిక్యత ఇచ్చిన ఆరు శాతం ఓటర్లల్లో ఎక్కువమంది ముస్లింలే ఉన్నారని పేర్కొంది.బీఆర్ఎస్ లో ప్రారంభంలో ఉన్న దూకుడు ఇక్కడ కనిపించట్లేదని, క్రమంగా వెనుకపడుతోందని లోక్ పోల్ అభిప్రాయపడింది. మాగంటి సునీత గెలుపు కోసం కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ..కిందిస్థాయి క్యాడర్ లో ఆ జోష్ కనిపించట్లేదు. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో బీఆర్ఎస్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రచారం సానుభూతి కోణం చుట్టూ తిరుగుతోండటం కూడా మైనస్ గా మారింది. హిందూ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ తన ప్రచారాన్ని కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును కొంతమేర చీల్చే అవకాశం ఉందని లోక్ పోల్ తెలిపింది.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News