అమరావతి,ఐఏషియ న్యూస్: మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన హోం మంత్రి వంగలపూడి అనిత పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. మొంథా తుఫాను సమయంలో అత్యుత్తమ సేవలు అందించిన అధికారులను, సిబ్బందిని శనివారం అమరావతిలోని ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం సత్కరించారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనితకు ప్రశంసా పత్రం మరియు ఉత్తమ సేవా అవార్డు ను ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. తుఫాను సమయంలో ప్రజల రక్షణ, సహాయక చర్యల సమన్వయంలో కీలక పాత్ర పోషించినందుకు హోం మంత్రిని సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ప్రజాసేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన మార్గం మాకు దిశానిర్దేశమన్నారు.మీ శిష్యరికంలో ప్రజలకు సేవ చేయడం నేర్చుకున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం మా బాధ్యతగా భావిస్తున్నాం అని తెలిపారు. మీ చేతుల మీదుగా ‘సైక్లోన్ మొంథా ఫైటర్’ సర్టిఫికెట్ స్వీకరించడం, మీ నుంచి ప్రశంసలు అందుకోవడం నా జీవితంలో మర్చిపోలేని అనుభవమన్నారు. ముఖ్యమంత్రి మార్గదర్శకంలోనే మొంథా తుఫాను సమయంలో ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా కాపాడగలిగాం అని అన్నారు. తుఫాను సమయంలో ప్రజలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News