
- మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
- ఫ్యామిలీపై క్రిమినల్ కేసులు పెట్టారని ఆరోపణ
- అమరావతి రైతుల పోరాటాన్ని కొనియాడిన మాజీ సీజేఐ
అమరావతి,ఐఏషియ న్యూస్: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. అమరావతిలోని వీఐటీ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. ఆ సమయంలో తనను మాత్రమే కాకుండా, చివరికి తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని, వారిపై క్రిమినల్ కేసులు బనాయించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.కాగా, రాజధాని అమరావతి నిర్మాణం రైతుల కష్టం, త్యాగాల పునాదులపై జరుగుతోందని జస్టిస్ రమణ అన్నారు. దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక రాజధాని కోసం ఇంత సుదీర్ఘంగా పోరాటం చేసిన ఘనత అమరావతి రైతులదేనని కొనియాడారు. కష్టకాలంలో న్యాయ వ్యవస్థపై రైతులు నమ్మకం ఉంచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.శనివారం వీఐటీ యూనివర్సిటీలో 5వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News