ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలు కీలకంగా మారాయి. ఈ క్రమంలో మరోసారి కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ఐదేళ్ల క్రితం కొత్త పంచాయతీలు ఏర్పడగా,ఇప్పుడు తాజాగా మరికొన్ని కొత్త పంచాయలతీలు రానున్నాయి. గతంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాగా ఉన్నప్పుడు, 2020లో కొత్త పంచాయతీలు ఏర్పాటు చేశారు. అప్పుడు మొత్తం 50 పంచాయతీలు ఏర్పడ్డాయి. అందులో అనకాపల్లి జిల్లాలోనే 49 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో ఒకటి రెండు తప్ప మిగతా అన్నిటికీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు, ఇతర మార్పులకు ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో కొత్త పంచాయతీల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది.ప్రభుత్వం పంచాయతీల పునర్వ్యవస్థీకరణకు అనుమతినిచ్చిందదీని ద్వారా ఒక పంచాయతీని రెండుగా విభజించడం, రెండు పంచాయతీలను ఒకటిగా కలపడం, ఒక గ్రామాన్ని వేరే పంచాయతీలో విలీనం చేయడం, లేదా పురపాలక, నగరపాలక సంస్థల్లోకి చేర్చడం వంటివి చేయవచ్చు. అయితే, ఒక పంచాయతీని వేరే మండలానికి మార్చే అవకాశం మాత్రం లేదు. ఈ మార్పుల కోసం స్థానికుల నుంచి అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి.ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలంలోని గ్రామాలను, వి.మాడుగుల మండలంలోని గ్రామాలను, కోటవురట్ల మండలంలో గ్రామాలను, రాంబిల్లి మండలంలోని గ్రామాలను విభజించి కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇలా జిల్లాలో ప్రతిపాదనలు దాదాపు 40 వరకు ఉన్నాయని చెబుతున్నారు.ఒక కొత్త పంచాయతీని ఏర్పాటు చేయాలంటే.. ‘ఆ గ్రామంలోని జనాభా, వనరులు, ప్రస్తుత పంచాయతీకి, ప్రతిపాదిత గ్రామానికి మధ్య దూరం, రెవెన్యూ సర్వే నంబర్ల విభజన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గ్రామాల విలీనం, విభజనకు సంబంధించి పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయాలి. పాలకవర్గం లేని చోట్ల, ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ సడలింపుతో స్థానిక అవసరాలకు అనుగుణంగా పంచాయతీల ఏర్పాటు, విలీనం సులభతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు.పంచాయతీల్లో మార్పులు, చేర్పులకు నిషేధం తొలగించడంతో ఆదేశాలు వచ్చిన కొత్త ప్రతిపాదనల్ని పంపిస్తామంటున్నారు అధికారులు.ఈ ప్రక్రియ ప్రారంభించి గ్రామసభలు పెట్టి, తీర్మానాలు, అభ్యంతరాలు స్వీకరిస్తామంటున్నారు.కొత్త పంచాయతీలు ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయంతో స్థానిక రాజకీయ నాయకుల జోష్ పెరిగింది. కొత్త సర్పంచ్ గా స్థానికంగా మరికొంతమందికి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News