
- విశాఖ వేదికగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
- 72 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు
విశాఖపట్నం ,ఐఏషియ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాగా ఈ సదస్సును భారతదేశ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అలానే కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు.
అలానే ఈ సదస్సులో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, సీఎస్ విజయానంద్, సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా కరణ్ అదానీ, యూసఫ్ అలీ, బాబా కల్యాణి తదితర దిగ్గజ పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. వీరితో పాటు దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు.
దేశానికి గేట్వే లా ఆంధ్రప్రదేశ్
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశానికి గేట్వే లా ఆంధ్రప్రదేశ్ మారుతోందని వ్యాఖ్యానించారు. దేశంలోనే అందమైన నగరంగా విశాఖకు పేరుందని,సురక్షితమైన నగరంగా కేంద్రం ప్రకటించిందన్నారు.ఈ సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు వచ్చారని పెట్టుబడిదారుల లక్ష్యంగా మన రాష్ట్రం ఎదుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ పరిపాలనపై దేశ ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. 2047 లోగా మనదేశం నంబర్ వన్ ఎనానమీ అవుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. పేదరికం, అసమానతలు రూపుమాపేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గ్రీన్ఎనర్జీ వినియోగం, స్వచ్ఛాంధ్ర దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీలో మనవాళ్లే ముందుంటున్నారని వివరించారు. ఏపీకి స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తున్నాయని వెల్లడించారు. అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
దేశానికి గ్రోత్ ఇంజన్గా ఏపీ..
ఇక ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. దేశానికి గ్రోత్ ఇంజన్గా ఏపీ, ఏపీకి గ్రోత్ కారిడార్గా విశాఖ తయారవుతున్నాయని అన్నారు. అమరావతి నిర్మాణం, విశాఖ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు వేగంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఏపీలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సహకరిస్తున్నారని వెల్లడించారు.మరోవైపు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ఆంధ్రప్రదేశ్ ఆధునికంగా మారుతోందని అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదానీ తెలిపారు. భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, లక్షకు పైగా ఉద్యోగాలను కూడా అదానీ సంస్థ కల్పించిందని వివరించారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్కు అనుగుణంగా ఏపీకి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు వస్తున్నాయని జీఎంఆర్ సంస్థ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు వ్యాఖ్యానించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News