తమ “కుటుంబానికి” ఇప్పటికీ “ప్రాణహాని” ఉంది

కుప్పం,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: తమ కుటుంబానికి ఇప్పటికి ముప్పు ఉందని సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ ఫ్యామిలీకి ఇంకా బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
కాగా ప్రజలకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. వైసీపీ పాలన గురించి మాట్లాడనని అది మర్చిపోలేని అంశమని పేర్కొన్నారు. అయితే వారి కుటుంబాన్ని ఎవరు బెదిరిస్తున్నారనే విషయాన్ని చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అలానే స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను ఆమె అభినందించారు. దయాళ్ శ్రవణ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన వినికిడి పరికరాలను పంపిణీ చేశారు.ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వరి శాంతిపురంలోని తమ నివాసంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
కుప్పం నియోజకవర్గం నుంచి మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులతో నారా భువనేశ్వరి సమావేశం అయ్యారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొంది మెగా డీఎస్సీకి ఎంపికైన 20మంది ఉపాధ్యాయులను నారా భువనేశ్వరి అభినందించారు. కుప్పం నియోజకవర్గం నుంచి 117 మంది మెగా డీఎస్సీకి ఎంపిక అవ్వటం సంతోషంగా ఉందన్నారు.
అనంతరం డీకే పల్లి వద్ద కృష్ణా జలాలకు ఆమె జల హారతి ఇచ్చారు. అంతకు ముందు గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణమ్మకు చీర సారె అందించడం తన పూర్వజన్మ సుకృతమని భువనేశ్వరి పేర్కొన్నారు.కుప్పంలో నారా భువనేశ్వరి మొత్తంగా నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇప్పటికే రెండు రోజులు పూర్తి కాగా మరో రెండు రోజుల పాటు పర్యటన కొనసాగించనున్నారు.మిగిలిన రోజుల్లో కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆమె వెంట టీడీపీ మహిళా నేతలు, స్థానికులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

కార్మికులు, కార్మికుల కోసం మాట్లాడే వాళ్లంటే నాకు ఎంతో ఇష్టం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కార్మికులు, కార్మికుల కోసం మాట్లాడే వాళ్లంటే నాకు ఎంతో ఇష్టమని సినీ నటులు ప్రకాష్ రాజ్ అన్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *