
25న న్యూయార్క్ లో ప్రత్యేక సమావేశం
న్యూయార్క్,ఐఏషియ న్యూస్: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే భారత్- అమెరికా మధ్య కూడా ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్ పై 50 శాతం సుంకాలు విధించింది అమెరికా. ఈ టారిఫ్ లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో అమెరికా, పాకిస్థాన్ దగ్గరవుతున్నాయి. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మార్షల్ అసిమ్ మునీర్ త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశం కానున్నారు. ఈనెల 25 న ఈ సమావేశం జరగనున్నట్లు పాకిస్థాన్ లోని జియో న్యూస్ పేర్కొంది.ఈనెల 25 న న్యూయార్క్ లో జరగనున్న యూనైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(యు ఎన్ జి ఏ) సమావేశాల్లో భాగంగా ఇరు దేశాల అధినేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటుగా ఆర్మీ చీఫ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా ఆయన వెంట పర్యటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇరు దేశాల నేతల అమెరికా అధ్యక్ష భవనం అయిన వైట్ హౌజ్ లో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పాకిస్థాన్ నియంత అసిమ్ మునీర్ ఇది మూడోసారి అమెరికా వెళ్తుడటం ఆందోళన కలిగిస్తోంది. పహల్గాం దాడి తర్వాత ఇప్పటికే రెండుసార్లు అమెరికాలో పర్యటించారు అసిమ్ మునీర్. ట్రంప్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలో భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లోని డ్యామ్ లను కూల్చేస్తామని హెచ్చరించారు. తాజాగా మరోసారి అమెరికా పర్యటనకు సిద్ధమయ్యారు అసిమ్ మునీర్.ఇక భారత్ పై అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఇటీవల చైనాలో పర్యటించారు. ఎస్ సీఓ సమావేశంలో పాల్గొన్నారు. చైనా, రష్యాలతో భారత్ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో అమెరికాకు దగ్గరవ్వాలని పాకిస్థాన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత్ పై మరిన్ని సుంకాలు విధించేలా పాకిస్థాన్ ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News