బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఒడిశా కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) మాజీ వ్యవస్థాపక చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) చైర్మన్ గా నియమితులయ్యారు. మంగళవారం నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చింది. గత రెండేళ్లుగా ఎన్ఎస్ఈకి సారథి లేరు. తొలి పబ్లిక్ ఇష్యూకి (ఐపీఓ) ఎక్స్ఛేంజీ సిద్ధం అవుతున్న సమయంలో తెలుగు మూలాలున్న శ్రీనివాస్ నియామకం జరిగింది. ఆయన ఇటీవల ఎన్ఎస్ఈలో పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్ గా చేరారు. గతంలో ఆయన కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పని చేశారు.కార్పొరేట్, ఆర్థిక నియంత్రణలు, పారిశ్రామిక ప్రోత్సాహం,కార్పొరేట్,దివాలా చట్టం, కాంపిటీషన్ చట్టం, చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వంటి భిన్న రంగాల్లో ఆయనకు నాలుగు దశాబ్దాలకు పైబడిన అనుభవం ఉంది. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బీఏ (హానర్స్) పూర్తి చేసిన శ్రీనివాస్ 1983లో ఒడిశా కేడర్ అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కి పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News