
మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత పేర్ని నాని వెల్లడి
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలంటే పాదయాత్ర చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన తర్వాతే 2004లో అధికారంలోకి వచ్చారు.ఆ తర్వాత చాలామంది రాజకీయ నాయకులు పాదయాత్ర చేయడం ప్రారంభించారు. ఇక ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర నిర్వహించారు.ఆ తర్వాతే ఆయన ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలోనే గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన వైఎస్ జగన్.మళ్లీ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు.ఈ విషయాన్ని తాజాగా మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్లో గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి పాలనను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు 2027లో మరోసారి “ప్రజా సంకల్ప” పేరిట పాదయాత్ర చేయనున్నారని తెలిపారు. వైఎస్ జగన్ పాదయాత్ర మొదలు పెట్టి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యాలయ ఇంఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ముందుగా దివంగత నేత వైయస్సార్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పేర్ని నాని జగన్ పాదయాత్రకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.రాష్ట్రంలో పేదవాడికి వైద్యం మరింత చేరువ చేసేందుకు 5 ఏళ్ల వైసీపీ పాలనలో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించి అందులో 7 కాలేజీలను పూర్తి చేసినట్లు పేర్ని నాని వెల్లడించారు. అయితే టీడీపీ-జనసేన- బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంగ్లిష్ మీడియం రద్దు చేశారని, మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు అప్పగిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో పేర్ని నానితో పాటు మేరుగ నాగార్జున, శైలజానాథ్,మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు,మల్లాది విష్ణు,ఎమ్మెల్సీలు అరుణ్కుమార్, వరుదు కల్యాణి, హనుమంతరావు, రుహుల్లా పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News