
నాగబాబు ప్రశ్నలకు హోం మంత్రి సమాధానం
అమరావతి,ఐఏషియ న్యూస్: మొదటిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టిన కొణిదెల నాగబాబు,మొదట్లో కొంత సైలెంట్గా ఉన్నప్పటికీ, ఈరోజు ఆయన చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. కూటమి ,వైఎస్సార్సీపీ సభ్యుల నుంచి శుభాకాంక్షలు అందుకున్న తర్వాత,2019-24 కాలంలో తప్పుడు అక్రమ క్రిమినల్ కేసుల పరిష్కారంపై మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా, దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పోలీసు కేసుల గురించి ఆయన గణాంకాలతో సహా సభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులకు పరిష్కారం చూపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై రాష్ట్ర హోం మంత్రి అనిత స్పందించి సమాధానం ఇస్తూ గత ప్రభుత్వం చాలామందిపై అక్రమ కేసులు పెట్టిందని తెలియజేశారు. అమరావతి రైతులు రాజధాని కోరుకుంటే వందలాది మందిపై కేసులు పెట్టారు. నాపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే కడప కోర్టుకు హాజరయ్యానన్నారు.చీకటి జీవోలు తెచ్చే సంస్కృతి కూటమి ప్రభుత్వానికి లేదు.రికార్డులు, లా ప్రకారం కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.సీపీఎస్ రద్దు కోరుతూ టీచర్లు చేసిన ఆందోళనలో 80 శాతం కేసులు ఎత్తివేయడం జరిగిందన్నారు .మిగిలిన కేసుల పరిష్కరానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News