ద్రాక్షారామం,ఐఏషియ న్యూస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయం సప్తగోదావరి తీరాన ఉత్తర గోపురం వద్ద ఉన్న కపాలేశ్వరస్వామి శివలింగాన్ని దుండగులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు.మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు,భక్తులుతీవ్రదిగ్భ్రాంతిచెందారు.శివలింగంపై సుత్తి వంటి మొనదేలిన ఆయుధంతో కొట్టి విరగ్గొట్టి ధ్వంసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని స్వయంగా పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడి ఆధారాలను సేకరించడం జరిగింది ఆలయ ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో, ఆలయం చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఫుటేజీని పోలీసులు జల్లెడ పడుతున్నారు.నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఎస్పీ రాహుల్ మీనా ప్రకటించారు.
నూతన శివలింగం ప్రతిష్ఠ
ధ్వంసమైన శివలింగం స్థానంలో నూతన శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు.మంగళవారం మధ్యాహ్నానానికి పురావస్తు శాఖ సీఏ కెఎన్.మూర్తి నూతన శివలింగాన్ని సమకూర్చారు.అప్పటికే అక్కడికి చేరుకున్న దేవదాయశాఖ ఉపకమిషనరు డీవీ.రమేష్ బాబు పర్యవేక్షణలో ఆలయ వేదపండితులు, స్వస్తివాచకులు, అర్చకులు హోమం, పూజాధికాలు నిర్వహించారు. సూర్యాసమయం లోపే శాస్త్రోక్తంగా నూతన శివలింగం ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో అల్లు భవానీ, దే వదాయశాఖ తనిఖీదారు బాలాజీ రామ్ ప్రసాద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ ఘటన కు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఘటనపై దర్యాప్తు అంశాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News