అమరావతి,ఐఏషియ న్యూస్: తాడేపల్లిలో రాష్ట్ర స్థాయి క్రైమ్ రివ్యూ సమావేశం శనివారం జరిగింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సమావేశంలో ప్రస్తుత ఏడాదిలో నమోదైన నేరాలు, వాటిపై విధించిన శిక్షలు,కేసుల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, కేసుల త్వరిత పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.సైబర్ క్రైమ్, క్రిప్టో కరెన్సీ దుర్వినియోగం, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డీప్ ఫేక్ టెక్నాలజీ వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన నివారణ చర్యలపై మంత్రి అనిత అధికారులతో చర్చించారు. సమావేశంలో భాగంగా నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 12 మంది అధికారులను సన్మానించారు. వారి సేవలను ప్రశంసిస్తూ, ఇతరులకు ప్రేరణగా నిలవాలని సూచించారు.నూతన సంవత్సరంలో కేసుల పరిష్కారానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించి, నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను మంత్రి అనిత ఆదేశించారు.ఈ సమావేశంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, నిపుణులైన ప్రొఫెసర్లు పాల్గొని తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సమన్వయంతో కూడిన కార్యాచరణ అవసరమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులను హోంమంత్రి సత్కరించారు. సిఐడి డిజి డాక్టర్ రవిశంకర్ , లీగల్ అడ్వైజర్ లక్ష్మణరావు,పదిమంది సిఐడి ఎస్పీలు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News