
11న ఎన్నికలు 14న కౌంటింగ్
హోరాహోరీ ఎన్నికల ప్రచారం మాటలతూటాలు
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపెవరిది.ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారిన చర్చ. పోలింగ్ సమీపిస్తున్న వేళ జూబ్లీహిల్స్ లో అంచనాలు మారుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. గెలుపు పైన ధీమాగా ఉన్నా.. లోలోపల మాత్రం ఆందోళనతో ఉన్నాయి. ఈ సమయంలో ప్రముఖ సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. పబ్లిక్ మూడ్ పైన అంచనాలను వెల్లడి స్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ సర్వే సంస్థ జూబ్లీహిల్స్ లో చేసిన సర్వేలో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి.గెలిచేదెవరో తేల్చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీఎం రేవంత్.. బీఆర్ఎస్, బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. త్రిముఖ పోటీ కొనసాగుతోంది. ఇతర అభ్యర్ధులు బరిలో ఉన్నా.. ఈ మూడు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఈ ఎన్నిక పైన పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉందని.. ప్రభుత్వంతో పాటుగా మంత్రుల కు ఇక్కడ గెలుపు కీలకం కానుందని పార్టీ నేతలకు సీఎం రేవంత్ దిశా నిర్దేశం చేసారు. తానే స్వయంగా రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ పూర్తిగా జూబ్లీహిల్స్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు.బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో ఆరోపణలు.. విమర్శలు తారా స్థాయికి చేరాయి.ఇదే సమయంలో సర్వే సంస్థలు జూబ్లీహిల్స్ ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.గెలిచే అవకాశాలపైన సర్వే నివేదికలను వెల్లడిస్తున్నాయి.మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్’ పేరిట ఎస్ఏఎస్ గ్రూప్ సంస్థకు చెందిన ఐఐటియన్ల టీమ్ చేసిన తాజా సర్వేలోనూ జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారో తేల్చేసారు. ఈ రిపోర్టను సంస్థ తాజా విడుదల చేసింది. ఈ సర్వే టీమ్ అక్టోబర్ 27 నుంచి, నవంబర్ 3 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి సర్వే చేసింది. ఇందులో బీఆర్ఎస్కే తమ ఓటు అని సర్వేలో పాల్గొన్న 46.5 శాతం మంది తేల్చి చెప్పారు. కాంగ్రెస్కు 42.5 శాతం మంది మద్దతు ప్రకటించగా, బీజేపీకి 8.25 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే సంస్థ పేర్కొన్నది. ఇతరులకు 2.75 శాతం మంది ఓటు వేయవచ్చని అంచనా వేసింది.
మొత్తంగా కాంగ్రెస్ కంటే 4 శాతం ఎక్కువ మెజార్టీతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది.నియోజకవర్గంలో సెటిలర్ల సంఖ్య ఎక్కువగా ఉందన్న సర్వే వారి మద్దతు బీఆర్ఎస్కే ఉన్నట్టు తేల్చి చెప్పింది.నియోజకవర్గంలో కీలకమైన ఎర్రగడ్డ, యూసుఫ్గూడ, బోరబండ, శ్రీనగర్ కాలనీ వంటి డివిజన్లలో బీఆర్ఎస్ ఆధిక్యత ఉందని విశ్లేషించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ, ముస్లిం మైనారిటీ వంటి సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషిస్తాయని సర్వే సంస్థ అభిప్రాయపడింది. ప్రభుత్వ పథకాల అమలు విషయంలోనూ బస్తీ ప్రాంతాల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత కనిపించిందని సర్వే వివరించింది. కాగా,సామాజిక సమీరణాలు కీలకంగా మారాయని, డిసైడింగ్ ఫ్యాక్టర్ గా చెప్పుకునే వర్గాల్లో మెజార్టీ ఓటర్లు ఇప్పటికే తమ ఓటు ఎవరికో డిసైడ్ అయిపోయారని పేర్కొంది.దీంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. కాగా ఈ నెల 11న పోలింగ్ 14న వెల్లడయ్యే ఫలితాల్లో ఇక్కడ గెలిచేదెవరో అనే ఉత్కంఠ రాజకీయ నాయకుల్లో నెలకొంది.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News