
పలు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డులు స్వాధీనం
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో అవినీతి కేంద్రాలుగా మారిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రభుత్వం అవినీతి నిరోధానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రం పరిస్ధితి మారడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ విరుచుకుపడుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏకంగా 120 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏకకాలంలో దాడులు జరుపుతోంది.
రాష్ట్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అవినీతిపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు ఇవాళ ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, విజయనగరం జిల్లా భోగాపురం, విశాఖ జిల్లా పెదగంట్యాడ, రీజనల్ కార్యాలయం, మధురవాడ,సత్యసాయి జిల్లా చిలమత్తూరు,పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటతో పాటు పలుచోట్ల ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.ఆయా కార్యాలయాల్లో రికార్డుల్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు.
రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీ ఎత్తున లావాదేవీలు జరుగుతున్నా రికార్డుల్లోకి రావడం లేదనే ఫిర్యాదులు ఎప్పటి నుంచో ఉన్నాయి. పలు చోట్ల డబ్బు కోసం రికార్డుల్ని మార్చేస్తున్న ఘటనలపైనా ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై స్థానిక అధికారుల నుంచి రాష్ట్రస్దాయి వరకూ పలు చోట్ల అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఏసీబీ దాడులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు పలు చోట్ల దాడులు జరిపి కీలక డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం.ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News