
సకాలంలో స్పందించి విద్యార్థులను ఆస్పత్రికి తరలించిన ఉపాధ్యాయులు
గూడెం కొత్తవీధి,ఐఏషియ న్యూస్: గూడెం కొత్తవీధి మండలంలోని జర్రెల గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందిన విద్యార్థులు గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు సకాలంలో స్పందించి అస్వస్థతకు గురైన విద్యార్థులను జర్రెల పీహెచ్సీకి తరలించి చికిత్స అందజేశారు.ఈ పాఠశాలలో సుమారు 210 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారిలో సుమారు 30 మంది అస్వస్థతకు గురయ్యారని ఉపాధ్యాయులు తెలియజేశారు. బుధవారం రాత్రి కందదుంప కూర వండటం జరిగిందని, 30 మంది విద్యార్థులు కంద దుంపలో పెరుగు కలిపి తినటం వలన అస్వస్తులయ్యారని విద్యార్థులకు చికిత్స చేస్తున్న డాక్టర్ మజీద్ తెలిపారు. విద్యార్థుల అస్వస్థత సమాచారం అందుకున్న ఏ.టి.డబ్ల్యూ. ఓ జయనాగలక్ష్మి హుటాహుటిన పాఠశాల, ఆసుపత్రికి వెళ్ళి విద్యార్థులకు జరిగిన స్వస్థత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై కలెక్టర్, ఐటీడీఏ పీవో, డీడీకి సమాచారం అందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. సకాలంలో ఉపాధ్యాయులు స్పందించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News