దుబాయ్,ఐఏషియ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. రెండో రోజు అబుదాబిలో పారిశ్రామిక దిగ్గజాలతో ముఖ్యమంత్రి నిర్వహించిన వన్-టూ-వన్ సమావేశాలు రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకమైనవిగా మారాయి.
ప్రధానంగా ఎనర్జీ రంగంపై ఫోకస్
విశాఖలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ రాబోతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి గ్రీన్ ఎనర్జీ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ రంగంలో పెట్టుబడుల కోసం అపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఛైర్మన్ ఖలీఫా ఖౌరీ, మస్దార్ సీఈఓ మొహమ్మద్ జమీల్ అల్ రమాహీలను ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు.
సూపర్ కెపాసిటర్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అపెక్స్ సంస్థ, ఆంధ్రప్రదేశ్లో బ్యాటరీ స్టోరేజ్ రంగంలో పెట్టుబడులు పెట్టడంపై చర్చించింది. అంతేకాక, సూపర్ కెపాసిటర్ ఉత్పత్తులను రాష్ట్రానికి పంపాలని సీఎం కోరగా, అపెక్స్ ప్రతినిధులు అందుకు అంగీకరించారు. ఆతిథ్య రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆ సంస్థను ఆహ్వానించారు. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ ,బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని సీఎం మస్దార్ సీఈఓను కూడా ఆహ్వానించడం జరిగింది.
ఆహార శుద్ధి రంగంపై ప్రత్యేక ఆకర్షణ
ఎనర్జీతో పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడుల కోసం అగ్తియా గ్రూప్ సీఈఓ సల్మీన్ అలమేరీ, లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీలతో సీఎం విడివిడిగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్తియా గ్రూప్కు ఒక ప్రత్యేక సూచన చేశారు. ఆంధ్రప్రదేశ్లో కోకో ఉత్పత్తి బాగా జరుగుతుంది. కాబట్టి మీ చాక్లెట్ పరిశ్రమ పెట్టే అంశంపై ఆలోచన చేయండి అని కోరారు.
లులు గ్రూప్ను కూడా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.చివరగా, గల్ఫ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను తీసుకుని విశాఖపట్నంలో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు రావాలని ముఖ్యమంత్రి పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించారు. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ సమావేశంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టి భరత్ అధికారులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News