హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ అసెంబ్లీలో గతంలో కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్,ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల విషయంలో ఎట్టకేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలు,ఆయా పార్టీల ప్రతినిధులతో విచారణ నిర్వహించిన స్పీకర్ ఇవాళ తన నిర్ణయం ప్రకటించారు. ఓవైపు సుప్రీంకోర్టు వరుస డెడ్ లైన్లతో ఉరుముతున్న వేళ స్పీకర్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తెల్లం వెంకట్రావు,బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య, సంజయ్ కుమార్ కాంగ్రెస్ వైపు మొగ్గారు. దీంతో వాళ్ల సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ వీరిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది.దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే కాలం గడిపేశారు.దీంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది.పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వీరి అనర్హత పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.అయినా ఆయన స్పందించకపోవడంతో ఆ తర్వాత సుప్రీంకోర్టు పలు డెడ్ లైన్లు కూడా పెట్టింది. చివరికి తాజాగా విచారణ ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్. 8 మంది ఎమ్మెల్యేలపై విచారణను పూర్తి చేశారు.ఇందులో ఐదుగురు ఎమ్మెల్యేలకు ఇవాళ క్లీన్ చిట్ ఇచ్చారు.వీరిలో తెల్లం వెంకట్రావు,బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్,అరికెపూడి గాంధీ ఉన్నారు.వీరిపై అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని ఆయన తేల్చేశారు.మరోవైపు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య, సంజయ్ కుమార్ లపై అనర్హత వేటు పిటిషన్ల విచారణ కూడా ముగిసినా తీర్పు గురువారానికి వాయిదా వేశారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదు.అయితే ఈ నెల 19న సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ పై మరోసారి విచారణ జరగనున్న నేపథ్యంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.దీనిపై బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News