ఏలూరు,ఐఏషియ న్యూస్: సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ చేసిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదే అన్నారు. సోమవారం నెలలవారీ పెన్షన్ల పంపిణీ కోసం ఏలూరు జిల్లాకు వెళ్లిన అక్కడ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ పెన్షన్ల కోసం మన రాష్ట్రం కంటే ఎవరూ ఎక్కువ ఖర్చుపెట్టడం లేదన్నారు. ఏడాదికి 33వేల కోట్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో వందమందిలో పదమూడు మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. వారిలో 59శాతం మంది మహిళలే ఉన్నారన్నారు.రాష్ట్రానికి కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఆదాయం లేదని చంద్రబాబు తేల్చేశారు. అయినా ఒకేసారి నాలుగువేలకి పెంచామన్నారు. అప్పటి ప్రభుత్వం ముక్కుతూ,మూలుగుతూ 250 రూపాయల చొప్పున పెంచిందని ఆరోపించారు. జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని, లేకపోతే మిషన్లు మనకు సేవ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అప్పటి ప్రభుత్వం రైతులకు 1,650 కోట్లు బకాయిలు పెట్టిందని, ఆ బకాయిలు తీర్చడమే కాదు, ఇప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి నాలుగు గంటల్లో ఇస్తున్నామన్నారు. 25 కోట్లు మంది మహిళలు ఉచిత బస్ పథకాన్ని వినియోగించుకున్నారన్నారు.
పింఛన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
ఏలూరు జిల్లా, ఉంగటూరు నియోజకవర్గం, గోపీనాథపట్నం గ్రామంలో కిడ్నీ బాధిత మహిళ గుడ్ల నాగలక్ష్మికి సీఎం చంద్రబాబు పింఛను అందించారు. నాగలక్ష్మి పిల్లలు నాగపవన్, వాసవి చదువు గురించి సీఎం అడిగారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న నాగలక్ష్మికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్కు సూచించారు.
జిల్లా కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్విపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా తాను గ్రామసభ నిర్వహిస్తున్నానని,సిబ్బంది మాత్రం కనీస అవగాహన లేకుండా వచ్చారని కలెక్టర్ వెట్రీ సెల్వి ని సీఎం ప్రశ్నించారు. ఒక గ్రామంలో ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అనే కనీస అవగాహన లేకుండా వచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కుబడిగా గ్రామ సభలు పెట్టొద్దన్నారు. గ్రామాల అభివృద్ధి జరిగే విధంగా, ప్రజల ఆదాయం పెరిగే విధంగా అధికారులు ఆలోచన చేయాలని సూచించారు.పూర్తిస్థాయి సమాచారాన్ని తమకు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News