
- కలలో దేవతే చెప్పిందని పూజారి వింత వాదన
- పూజారిని అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు
ముంబై,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ముంబై శివారు చెంబూర్లోని ఒక కాళీమాత ఆలయంలో విగ్రహాన్ని మేరీమాత రూపంలోకి మార్చడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తున్న ఆలయ పూజారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. భక్తుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.చెంబూర్లోని అనిక్ విలేజ్లో ఉన్న హిందూ శ్మశానవాటికలోని కాళీ ఆలయంలో ఇటీవల ఈ ఘటన జరిగింది. కాళీమాత నల్లటి విగ్రహానికి తెలుపు రంగుపూసి,బంగారు వస్త్రాలు, సిలువతో కూడిన కిరీటాన్ని అలంకరించారు.అమ్మవారి చేతిలో శిశువు ఏసును పోలిన బొమ్మను ఉంచారు.గర్భగుడి నేపథ్యాన్ని కూడా ఎర్రటి వస్త్రం, పెద్ద సిలువతో మార్చేశారు. ఇది చూసి భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.దీనిపై పూజారిని ప్రశ్నించగా కలలో కాళీమాత కనిపించి తనను మేరీమాత రూపంలో అలంకరించమని చెప్పిందని సమాధానమిచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఎలాంటి పుకార్లు వ్యాపించకుండా, ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు పోలీసుల సమక్షంలోనే విగ్రహాన్ని తిరిగి పూర్వస్థితికి మార్చారు.పూజారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి లభించింది.మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 299 కింద కేసు నమోదు చేశారు.ఈ చర్య వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఇతరుల ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ తీవ్రంగా ఖండించాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News