
వైఎస్సార్సీపి స్టూడెంట్ వింగుకు దిశా నిర్దేశం చేసిన మాజీ సీఎం జగన్
తాడేపల్లి,ఐఏషియ న్యూస్: మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం దిశగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా అనుబంధ సంఘాల నేతలకు కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇక నుంచి తాను కార్యకర్తలతో మమేకవ్వాలని జగన్ నిర్ణయించారు. ఇందుకోసం త్వరలోనే సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. అదే సమయంలో చంద్రబాబు పాలన పైన జగన్ ధ్వజమెత్తారు. ఫీజు బకాయిలు.. మెడికల్ కాలేజీల విషయంలో పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. గుగూల్ క్రెడిట్ ను చంద్రబాబు చోరీ చేసారని జగన్ ఆరోపించారు.వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్టూడెంట్ వింగ్ అధ్యక్షులతో గురువారం జగన్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో కీలక దిశా నిర్దేశం చేసారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ వాయిస్ గా మారి నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు. మీరు ఎవరిని డిసైడ్ చేస్తే వారే అధికారంలోకి వస్తారని వ్యాఖ్యానించారు. గుగూల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసారని ఆరోపించారు. మెడికల్ కాలేజీల విషయంలో చెడు చేస్తున్నారని విమర్శించారు. మనకు ఇతర రాష్ట్రాల్లోనే పోటీ కాదని,పోటీ ప్రపంచతోనే అని చెప్పుకొచ్చారు. అత్యుత్తమ యూనివర్సిటీ కి చెందిన కోర్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు. డిగ్రీల్లో కొత్త కోర్సులు తీసుకొని వచ్చామని చెప్పారు. చంద్రబాబు పాలనలో ఫీజు రీయంబర్స్ మెంట్ రూ 4,200 కోట్లు పెండింగ్ లో ఉందని వివరించారు.
వసతి దీవెన కింద రూ 2,200 కోట్లు పెండింగ్ ఉందని చెప్పుకొచ్చారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగంలోనే 6.3 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగామని జగన్ చెప్పారు. వార్డు, గ్రామ సచివాలయాల్లో 1.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 52 వేల మందిని ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసామని, ఆరోగ్య రంగంలో భారీగా ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. కాగా, ఇప్పుడు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నారని విమర్శించారు.ఇక గుగూల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసారని జగన్ విమర్శించారు. సింగపూర్ నుంచి కేబుల్ తీసుకు వచ్చేలా అంకురార్పణ చేసింది వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పారు. ఆదానీ – గుగూల్ లో 2022 లో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉందని గుర్తుచేసారు. వైసీపీ హయాంలోనే అన్ని ఏర్పాట్లు జరిగాయని,ఈ కారణంగానే గుగూల్ వస్తుందన్నారు. మూలపేట నుంచి కట్టుకుంటూ వెళ్లామని వివరించారు.భోగాపురం విమానాశ్రయానికి అన్ని అనుమతులు తీసుకొచ్చి శరవేగంగా నిర్మాణాలు చేసామని చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ సరికాదన్నారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు 11వ తేదీ నుంచి 12వ తేదీకి మార్పు జరిగిందని వెల్లడించారు.డిసెంబర్ లో ఫీజు రీయంబర్స్ మెంట్ పై ఆందోళనలు ఉంటాయని జగన్ స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News