
రాష్ట్ర మాజీ మంత్రి, అనకాపల్లి వైసిపి అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆరోపణ
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్వలేకపోతున్న కూటమి ప్రభుత్వం చివరికి విద్యార్థుల జీవితాలను కూడా నాశనం చేయడానికి వెనుకాడటం లేదని, వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి మీద అక్రమంగా డ్రగ్స్ కేసు పెట్టి వేధించడమే దానికి ఉదాహరణ అని విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల వైయస్సార్సీపీ అధ్యక్షులు కెకె రాజు, గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడన్న కోపంతోనే కుట్రపన్ని కొండారెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని వివరించారు. పోలీసులు ఎఫ్ఐఆర్లోనమోదు చేసిన వివరాలన్నీ తప్పని చెప్పడానికి తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొంటూ సీసీ టీవీ ఫుటేజీలను ప్రదర్శించారు. కొండారెడ్డికి డ్రగ్స్ అలవాటు లేకపోయినా అతడ్ని పోలీసులు తీవ్రంగా కొట్టి సంతకాలు తీసుకున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని అతడు జడ్జి ముందు చెప్పి, తాను ఎలాంటి టెస్ట్కైనా సిద్ధమని ప్రకటించిన విషయాన్ని పార్టీ నాయకులు వెల్లడించారు. ఈ కేసులో కొండారెడ్డితోపాటు మరో ఇద్దర్నీ అరెస్టు చేశామని చెబుతున్న పోలీసులు, వారు ఏ కాలేజీలో చదువుతున్నదీ చెప్పలేదన్నారు. కానీ కొండారెడ్డి మాత్రం ఏయూలో చదువుతున్నాడంటూ మీడియాలో వార్తలు రాయించి యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర చేస్తున్నారని కెకె రాజు, గుడివాడ్ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండారెడ్డితోపాటు అరెస్ట్ అయిన విద్యార్థులు దాడి ఇంజినీరింగ్ కాలేజీ, గీతం యూనివర్సిటీల్లో చదువుతుంటే వాటి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కొండారెడ్డి కుటుంబానికి వైయస్సార్సీపీ అండగా ఉండి న్యాయపోరాటం చేస్తుందని వారు స్పష్టం చేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News