
విశాఖ,విజయనగరంలో కన్నీటి పర్యంతం
విశాఖపట్నం/విజయనగరం,ఐఏషియ న్యూస్: ప్రజా వైద్య సేవలో తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి, విశాఖపట్నం చెస్ట్ హాస్పిటల్ చీఫ్ సివిల్ సర్జన్ డాక్టర్ కూరెళ్ళ సాయి లక్ష్మీ గణపతి శాస్త్రి (సాయి – 59) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే విశాఖ నగరంతో పాటు ఆయనకు బలమైన అనుబంధం ఉన్న విజయనగరం జిల్లా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణం వైద్య ఆరోగ్యశాఖకు, ప్రజలకు తీరని లోటని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.
కరోనా సమయంలో నిరంతరాయ సేవలు.
వైద్యో నారాయణో హరి
డాక్టర్ శాస్త్రి కేవలం ఒక అధికారి కాదు, ప్రజలకు సేవ చేసిన ‘వైద్యో నారాయణో హరి’ రూపం. జీవీఎంసీలో పనిచేసిన కాలంలో అత్యంత సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా, ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి సమయంలో ఆయన అందించిన సేవలు అపారమైనవి. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా, తన ప్రాణాలను పణంగా పెట్టి విశాఖపట్నం ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేవారు..
ఆయన నిబద్ధత, నిస్వార్థమైన సేవా స్ఫూర్తిని గుర్తించిన ప్రభుత్వం అనేక అవార్డులు, ప్రశంసా పత్రాలు అందించింది.ఆయన మరణవార్త వినగానే, కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రజలు, సహచర ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందారు.
ఆయన ఆపదలో ఉన్న ప్రతి రోగికీ అండగా నిలిచారు
ఆ చిరునవ్వు, భరోసా ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన్ని కోల్పోవడం చాలా బాధాకరం,” అంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విషాదంలో మునిగిపోయారు.
విజయనగరంతో విడదీయరాని అనుబంధం
విశాఖలో ఉన్నత స్థానంలో ఉన్నా, డాక్టర్ శాస్త్రి మరణవార్త విజయనగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ జిల్లాతో ఆయన కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది.డాక్టర్ శాస్త్రి తండ్రి, స్వర్గీయ కూరెళ్ళ ఈశ్వర్, ఏసీబీలో డీఎస్పీగా పనిచేసి, నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. అంతేకాకుండా, జిల్లాలోని బ్రాహ్మణులందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో జిల్లా బ్రాహ్మణ సేవా సంఘముల సమాఖ్యను స్థాపించి గొప్ప గుర్తింపు పొందారు.
అలాంటి గొప్ప తండ్రికి తగ్గ తనయుడిగా, డాక్టర్ కూరెళ్ళ సాయిలక్ష్మీ గణపతి శాస్త్రి కూడా నిబద్ధత, సేవా స్ఫూర్తితో విశేష కీర్తిని పొందారు.ఆయన అకాల మరణంపై విజయనగరంలోనూ తీవ్ర సంతాపం వ్యక్తమైంది.
పలువురిసంతాపం
డాక్టర్ శాస్త్రి మృతి పట్ల జిల్లా బ్రాహ్మణ సేవా సంఘముల సమాఖ్య అధ్యక్షులు టి.వి. శ్రీనివాస్, ఇతర సభ్యులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
శాస్త్రి కుటుంబ నేపథ్యం
ఆయన భార్య (అగనంపూడి హాస్పిటల్ లో గైనకాలజిస్ట్), ఇద్దరు పిల్లలు కుమారుడు, కుమార్తె ఉన్నారు.ఆయన కుటుంబ సభ్యులకు ఉన్నతాధికారులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.డాక్టర్ శాస్త్రి మనల్ని వదిలి వెళ్లిన సేవా మార్గం, ఆయన నిజాయితీ, నిబద్ధత భావితరాలకు ఆదర్శం. ఆయన ఆకస్మిక నిష్క్రమణతో విశాఖ, విజయనగరం ప్రజల హృదయాలు భారమై, కన్నీటి పర్యంతమయ్యాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ భగవంతుని ప్రార్థించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News