శబరిమల,ఐఏషియ న్యూస్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా శబరిమల శ్రీఅయ్యప్ప స్వామి ఆలయాన్ని బుధవారం దర్శించుకున్నారు. మెుదట పంబా నదిలో కాళ్లను కడుక్కోవడం ద్వారా సాంప్రదాయ శుద్ధి ఆచారాన్ని పాటించారు. అనంతరం ఆమె పంపా గణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడే ఇరుముడిని సిద్ధం చేసుకుని అయ్యప్ప సన్నిధానంకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తరువాత రాష్ట్రపతి 18 బంగారు మెట్లు ఎక్కి అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక అభిషేక పూజల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో శబరిమలై దర్శించుకున్న మొట్టమొదటి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించారు.
రాష్ట్రపతికి తప్పిన పెను ప్రమాదం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం శబరిమల ఆలయ దర్శనానికి వెళ్లారు. అయితే రాష్ట్రపతి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. హెలిప్యాడ్ ఉన్నట్టుండి కుంగిపోయింది. శబరిమల దర్శనం కోసం పతనంతిట్ట జిల్లాలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వద్ద వాయుసేన హెలికాప్టర్లో రాష్ట్రపతి దిగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. హెలిప్యాడ్ కుంగిపోవడంతో హెలికాప్టర్ చక్రం అందులో ఇరుక్కుపోయింది. హుటాహుటిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సురక్షిత ప్రాంతానికి వాయిసేన సిబ్బంది తరలించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News