
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడి
అనకాపల్లి,ఐఏషియ న్యూస్: మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజల ప్రాణ మరియు ఆస్తి భద్రతను కాపాడే లక్ష్యంతో మంగళవారం రాత్రి 7 గంటల నుండి నేషనల్ హైవే–16పై అన్ని రకాల వాహనాల రాకపోకలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు.తుఫాన్ తీవ్రతను పరిగణనలోకితీసుకుని,భారీవర్షాలు,ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వాహనాలను రహదారి పక్కన భద్రంగా నిలిపివేయాలని సూచించారు. వాహనదారులు తమ భద్రత కోసం సమీపంలోని పార్కింగ్ బేలు లేదా సురక్షిత ప్రదేశాల్లో వాహనాలు నిలిపివేయాలని ఎస్పీ పేర్కొన్నారు.ప్రజలు, డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు జిల్లా పోలీసులు సమన్వయ చర్యలు చేపట్టారని, ప్రయాణికులతో ఉన్న బస్సులను సురక్షిత ప్రదేశాలైన రెస్టారెంట్లు, హోటళ్లు, విశ్రాంతి కేంద్రాల్లో ఆపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.అయితే, అత్యవసర సేవల వాహనాలు అంబులెన్సులు, ఫైర్ సర్వీసులు, పోలీసు వాహనాలు, అవసరమైన ప్రభుత్వ వాహనాలు మాత్రం ఈ ఆంక్షలకు లోబడవని ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు.మొంథా తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ఈ రాత్రి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని,ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News