విజయవాడ రద్దీ తగ్గించేందుకు గొల్లపూడి సాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి విజయవాడ ఎంపీ కేసినేని

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడ స్టేషన్ పై రైళ్ల రద్దీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో పలు ప్రత్యామ్నాయాలు తెరపైకి వస్తున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. ఆలోపు మరికొన్ని కొత్త ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా అమరావతి రైల్వే జంక్షన్ ప్రతిపాదన కూడా వచ్చింది. దీంతో కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇలాంటి సమయంలో విజయవాడ రైల్వే జంక్షన్ పై రద్దీ తగ్గించేందుకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు స్థానిక ఎంపీ కేశినేని చిన్ని మరో కీలక ప్రతిపాదన చేశారు.
విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఉన్న రద్దీని తగ్గించేందుకు గొల్లపూడిలోని బల్బ్ లైన్ల పరిధిలో శాటిలైట్ / హాల్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ఎంపీ కేశినేని కోరారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ ప్రాంతం రైల్వే అవసరాల కోసం భూసేకరణకు అనుకూలంగా ఉందని, ప్రధాన రహదారులు, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం, అలాగే రాబోయే అమరావతి న్యూ రైల్వే లైన్‌కు సమీపంలో ఉండటం వల్ల ఇది భవిష్యత్ రాజధాని అభివృద్ధికి కీలక కేంద్రంగా మారే అవకాశముందని వివరించారు.శాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటుతో అమరావతి న్యూ రైల్వే లైన్, అవుటర్ రింగ్ రోడ్లు వంటి అభివృద్ధి మౌలిక వసతులకు మెరుగైన అనుసంధానం కలగడమే కాకుండా, ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఉన్న రద్దీ గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ప్రజల సౌకర్యం, ప్రయాణికుల అవసరాలు,సరుకు రవాణా లాజిస్టిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖలతో కలిసి సంయుక్త తనిఖీ నిర్వహించి, ఫీజిబిలిటీ రిపోర్ట్‌తో పాటు డీపీఆర్ సిద్ధం చేయాలని ఎంపీ కోరారు. దీనిపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు.మరోవైపు కొండపల్లి రైల్వే స్టేషన్ నుంచి విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ వరకు ఉన్న రైల్వే ట్రాక్ వెంట మురుగు నీరు, వర్షపు నీరు నిల్వ అవుతున్న సమస్యలను కూడా ఎంపీ కేశినేని శివ‌నాథ్ కేంద్ర రైల్వే మంత్రికి వివరించారు. ఈ మార్గంలో నీటి నిల్వ కారణంగా రైల్వే భద్రత, నిర్వహణ సామర్థ్యం దెబ్బతింటోందని, మౌలిక వసతులు పదేపదే నష్టపోతున్నాయని తెలిపారు. కాబట్టి కొండపల్లి పారిశ్రామిక ప్రాంతం నుంచి భారీ స్థాయిలో సరుకు రవాణా జ‌రిగే ఈ రైలు మార్గానికి చాలా కీల‌కమ‌ని పేర్కొంటూ, సమగ్ర నీటి నిర్వహణ, ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఐదేళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలి

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *