
పోలీస్ అమరవీరుల దినోత్సవం లో సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే తప్ప, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల భద్రత, శాంతిని పరిరక్షిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆకాంక్షించారు.
“పోలీసు అమరవీరుల సంస్మరణ దినం” సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ గోషామహల్లో నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులను స్మరిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాల సభ్యులను పరామర్శించారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి , వివిధ పోలీస్ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు సురక్ష రూపొందించిన “అమరులువారు” పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News