బాపట్ల,ఐఏషియ న్యూస్: బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన 75 ఏళ్ల వృద్దుడు చిలంకూరి కాంతయ్య ఇంకొల్లులోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాను తాకట్టు పెట్టుకున్న బంగారు నగలను విడిపించుకోవాలని వచ్చాడు.అందుకు బ్యాంకులో కట్టాల్సిన 3 లక్షల 90 వేల రూపాయలు తీసుకుని బ్యాంకులోకి వెళ్లాడు.బ్యాంకు అధికారులు మరో 10 వేల రూపాయలు వడ్డీ అయిందని, మొత్తం 4 లక్షల రూపాయలు చెల్లించాలని సూచించారు. దీంతో మరో 10 వేల రూపాయలు ఇంటికి వెళ్లి తీసుకురావడానికి తన సైకిల్పై బయలుదేరేందుకు సిద్దమయ్యాడు.తన వెంట తీసుకొచ్చిన 3 లక్షల 90 వేల రూపాయల డబ్బులను సైకిల్ వెనుక ఉన్న క్యారేజ్పై పెట్టుకుని బయలుదేరాడు.తన ఇంటి ముందుకు వెళ్లేసరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ బైక్పై వెనుక నుంచి వచ్చి అతనిని ఏమార్చి 2 వంద రూపాయల నోట్లు అతని ముందు పడవేశారు. పెద్దాయన ఈ డబ్బు మీదేనా అంటూ మభ్యపెట్టారు. కిందపడ్డ వంద రూపాయల నోట్లను చూసిన కాంతయ్య వాటిని తీసుకునే పనిలో ఉండగా సైకిల్ వెనుక క్యారేజ్పై పెట్టిన 3 లక్షల 90 వేల రూపాయలు ఉన్న ఎర్ర కవర్ను తీసుకుని పరారయ్యారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన కాంతయ్య లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. కాంతయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News