హైదరాబాద్,ఐఏషియ న్యూస్: సైబర్ నేరగాళ్ల వలలో అనేకమంది చిక్కుతున్నారు. మాయమాటలతో అమాయకులను ఈజీగా మోసం చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు.రోజుకో రకంగా కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తూ నగదును దోచుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెట్టుబడుల పేరుతో, ఫోన్ కాల్స్, ఫేక్ యాప్లు,మెసేజ్ లింక్ల ద్వారా ప్రజల బ్యాంక్ వివరాలను సేకరించి డబ్బులు దోచుకుంటున్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు ఎక్కువవడంతో పోలీసులు వాటిపై ఫోకస్ పెట్టారు. అక్టోబర్లో సైబర్ నేరాలకు సంబంధించి భారీగా కేసులు నమోదు అయ్యాయి. వీటిని ఛాలెంజ్గా తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. వివిధ రాష్ట్రాల్లో గాలించి మరీ సైబర్ కేటుగాళ్లను భారీగా అరెస్ట్ చేశారు.సైబర్ నేరాలకు పాల్పడుతున్న 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 107 కోట్లను రికవరీ చేశారు. అక్టోబర్ నెలలో సైబర్ నేరాలకు సంబంధించి 196 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి నగదు కోల్పోయిన బాధితులకు వారి సొమ్మును తిరిగి అప్పజెప్పారు. దాదాపు 66 లక్షల రూపాయలను బాధితులకు అందజేశారు.అరెస్ట్ అయిన 55 నిందితులపై దేశవ్యాప్తంగా 136 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు 8 రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినవారని సైబర్ పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సైబర్ నేరాలు పట్ల ప్రజల అప్రమత్తంగా వ్యవహరించాలని ఇటువంటి అనుమానం వస్తే 1930కు తెలియజేయాలని పోలీసులు పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News