
- స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
- నర్సీపట్నంలో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయం ప్రారంభం
- వర్చువల్ విధానంలో 77 కార్యాలయాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
- ఉపాధి హామీ నిధులతో సాగునీటి కాలువలకు సిమెంట్ లైనింగ్ చేపట్టాలని స్పీకర్ సూచన
నర్సీపట్నం,ఐఏషియ న్యూస్: పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారంనర్సీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘డివిజనల్ అభివృద్ధి అధికారి’ (డిడిఓ)కార్యాలయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు రిబ్బన్ కట్ చేసి,శిలాఫలకాన్ని ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వర్చువల్ విధానంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా నర్సీపట్నం కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు.ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గతంలో పంచాయతీలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కూడా జిల్లాకేంద్రాలకు ,జెడ్పీకార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు డివిజన్ స్థాయిలోనే కార్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు, సర్పంచులకు ఎంతో సమయం ఆదా అవుతుందని అన్నారు. ఈ మంచి నిర్ణయం తీసుకున్నందుకు డిప్యూటీ సీఎంకి స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో సమితులు ఉన్నప్పుడు జరిగిన ప్రమోషన్ల తర్వాత, మళ్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చొరవతో అధికారులకు ప్రమోషన్లు రావడం శుభపరిణామం అని, దీనిపై అధికారులంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ వేదికగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు డిప్యూటీ సీఎం దృష్టికి రెండు ప్రధాన అంశాలను తీసుకువచ్చారు. డివిజనల్ కార్యాలయాలకు ఒకే నమూనాతో శాశ్వత భవనాలను నిర్మించాలని కోరారు. ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా పంట కాలువలకు సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తే, నీటి వృధాను అరికట్టి చివరి ఆయకట్టు వరకు నీరందించవచ్చని, దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనికి డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో నర్సీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ సూర్యచంద్ర, జిల్లాపరిషత్ ,సీఈవో పి.నారాయణమూర్తి, ఆర్డిఓ వి.వి. రమణ, డీఎస్పీ శ్రీనివాస్, జడ్పిటిసి రమణమ్మ, నర్సీపట్నం, నూతన డి డి వో లు ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News