పరవాడ,ఐఏషియ న్యూస్: తుక్కు దుకాణంలో ఫార్మా వ్యర్ద రసాయనాలు భగ్గు మన్నాయి. పరవాడ ఫార్మాసిటీ పరిసరాలలో తుక్కు దుకాణాలు విచ్చలవిడిగా ఏర్పడ్డాయి. అటు అనకాపల్లి పిసిబి అధికారులు, ఇటు పరవాడ పోలీస్ అధికారుల సహకారంతో ఫార్మా వ్యర్థ రసాయనాలు కంటైనర్ లను తుక్కు దుకాణాల ముసుగులో నిల్వ ఉంచుతున్నారు. వ్యర్థ రసాయనాలు భూమిలోకి ఇంకి కొంతమేర వ్యాపించడంతో అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. తుక్కు దుకాణాల సమీపంలో నిప్పు పుడితే పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పరవాడ మండల పరిధిలో ఎంఎస్ ఎంఈ పార్కులో గతంలో అనేకసార్లు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. వీటిపై పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కాలుష్య కారకాలు ఎక్కడ కానరాలేదని పిసిబి అధికారులు సమాధానమివ్వడం చూస్తే ఆందోళన కలగక మానదు. శనివారం మధ్యాహ్నం లంకెలపాలెం గొల్లపేట ప్రాంతంలోని స్క్రాప్ దుకాణంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. వ్యర్ధ రసాయనాలు దహనం కారణంగా దట్టమైన కాలుష్య పొగలు వ్యాపించాయి. ఈ దట్టమైన పొగలు కాలుష్య కారకాలను పర్యావరణంలోకి విడుదల చేస్తున్నాయి. ఇంత జరిగిన పిసిబి అధికారులు కనీసం స్పందించకపోవడం ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుంది. పరవాడ అనకాపల్లి అగ్నిమాపక దళాలు గంటల కొలది శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ కాలుష్యం మేఘాలు కమ్మేయడంతో ప్రజలు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇనుప తుక్కు నిల్వ కేంద్రాలకు కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరాదని ఇటీవల జిల్లా కలెక్టర్ ఏపీ ఈపీడీసీఎల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాటలు బభేకాతరు చేస్తూ ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు రాజకీయ సిఫార్సులతో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కూడా అగ్ని ప్రమాదాలకు కారణం అవుతుంది. జనవాసాల మధ్య తుక్కు దుకాణాలు ఏర్పాటు చేసి, అగ్ని ప్రమాదాలతో ప్రజల్ని భయ ఆందోళనలకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పరవాడ ఏసిపి నాగేశ్వరరావు
ఫార్మా వ్యర్థ పదార్థాలు అగ్నికి ఆహుతి అయిన స్క్రాప్ దుకాణాన్ని పరవాడ ఏసిపి నాగేశ్వరరావు, పరవాడ సిఐ మల్లికార్జునరావు పరిశీలించారు. సంఘటన జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎసిపి నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News