విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: తుని రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కుతూ రైలు కిందపడి తీవ్రంగా గాయపడిన ఆదిత్య కళాశాల విద్యార్థి గరికిన హేమన్ రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం వెంకటనగరం గ్రామానికి చెందిన హేమన్ రాజు సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లేందుకు జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కుతూ జారి పడడంతో అతని రెండు కాళ్లు తెగిపోయాయి. తీవ్రంగా గాయపడిన హేమన్ రాజును విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూశాడు.తుని రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రి కలలు కడలిలో కలిసిపోయే…
హేమన్ రాజు తండ్రి రామకృష్ణ సంప్రదాయ మత్స్యకారుడు. చేపల వేట ఆ కుటుంబం జీవనాధారం. కష్టాల కడలిలో ఈదుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకు హేమన్ రాజు పైనే ఆశలన్నీ నిలిపి ముందుకు సాగుతున్నాడు. తనలాగా కొడుకు కష్టపడకూడదు అని ఉన్నతచదువులుచదివించాలని తన శక్తికి మించి కొడుకుని చదివిస్తున్నాడు. హేమన్ రాజు కూడా తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుని బాగా చదువుతున్నాడు. ఈ క్రమంలో హేమన్ రాజు అర్ధాంతరంగా తనువు చాలించడం ఆ పేద కుటుంబం పై పెద్ద బండ పడ్డట్టు అయింది. నడిసంద్రంలో ఆ కుటుంబ నావ కొట్టుకుపోయేంత పరిస్థితి వచ్చింది. కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. వారిని ఆపడం ఎవరి తరం కావడం లేదు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News